– వివరాలు వెల్లడించిన టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ.
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
సిరిసిల్ల పట్టణ పరిధిలోని బి.వై. నగర్ వద్ద ఓ యువకుడిపై స్నేహితులే కులం పేరుతో దూషిస్తూ, విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఘటనపై సిరిసిల్ల టౌన్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ మేరకు టౌన్ ఇన్స్పెక్టర్ కే. కృష్ణ వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కే. కృష్ణ మాట్లాడుతూ.. సిరిసిల్ల అంబేడ్కర్ నగర్కు చెందిన ఆకునూరి కళ్యాణ్ (26), తండ్రి మోహన్ (ఎస్సీ మాదిగ) అనే యువకుడిపై గత శుక్రవారం (27-02-2026) అర్ధరాత్రి సమయంలో దాడి జరిగింది. పట్టణంలోని B.Y నగర్ జెండా గద్దె వద్ద కళ్యాణ్ను అతని స్నేహితులు అడ్డగించి గొడవకు దిగారు. ఈ క్రమంలో నిందితులు బాధితుడిని కులం పేరుతో అసభ్య పదజాలంతో దూషిస్తూ, చేతులతో, కాళ్లతో కొట్టడమే కాకుండా.. బండరాళ్లతో తలపై, శరీరంపై విచక్షణారహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు.
బాధితుడి తల్లి ఆకునూరి పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరిసిల్ల టౌన్ పోలీసులు తక్షణమే స్పందించారు. నిందితులపై హత్యాయత్నం (Attempt Murder) మరియు SC/ST అట్రాసిటీ చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి కఠినంగా శిక్షిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, కులం పేరుతో దూషిస్తూ దాడులకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
