మద్యం తాగి క్లాస్కు వచ్చిన ఎనిమిదో తరగతి విద్యార్థులు!
తెలంగాణలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు
విద్యార్థుల బ్యాగులు తనిఖీ చేయగా బయటపడ్డ మద్యం సీసాలు
బలగం టీవీ, కరీంనగర్:
తెలంగాణ రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న బెల్ట్ షాపుల దందా పసిపిల్లల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఓ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు గురువారం నాడు మద్యం సేవించి పాఠశాలకు హాజరయ్యారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రవర్తన అసాధారణంగా ఉండటంతో అనుమానం వచ్చిన ఉపాధ్యాయులు వారిని గమనించారు. వారి వద్ద నుండి మద్యం వాసన రావడంతో ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఉపాధ్యాయులు వెంటనే సదరు విద్యార్థుల బ్యాగులను తనిఖీ చేయగా, అందులో ఖాళీ మద్యం సీసాలు మరియు సగం తాగిన సీసాలు బయటపడ్డాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి విచారించగా, పాఠశాలకు సమీపంలోనే ఉన్న ఒక బెల్ట్ షాపు నుండి తాము మద్యం కొనుగోలు చేసినట్లు విద్యార్థులు నిర్భయంగా ఒప్పుకున్నారు. గ్రామాల్లో విచ్చలవిడిగా వెలిసిన బెల్ట్ షాపుల వల్లే చిన్న పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని స్థానికులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
