- డిఎస్పీ నాగేంద్రచారి.
బలగం టీవీ, ఇల్లంతకుంట:
జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఆదేశాల మేరకు, పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరియు భద్రతా ఏర్పాట్లను తెలియజేసేందుకు జిల్లా పోలీసులు ఇల్లంతకుంట మండలంలో మరియు కందికట్కూరు గ్రామంలో శనివారం సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్రచారి మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా పోలింగ్కు హాజరై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటర్లు భయపడకుండా ఓటు వేసేందుకు వీలుగా అన్ని పోలింగ్ కేంద్రాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మద్యం, నగదు లేదా ఇతర వస్తువుల ద్వారా ఎవరైనా ఓటర్లను ప్రలోభపెట్టినట్లు తమ దృష్టికి వస్తే, ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం ప్రజలలో ఆత్మస్థైర్యాన్ని నింపడానికేనని డీఎస్పీ తెలిపారు. ఈ ఫ్లాగ్ మార్చ్లో రూరల్ సి.ఐ మొగిలి, ఎస్.ఐ లు అశోక్, ఉపేంద్ర చారి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






