కరీంనగర్ జిల్లాకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి
బలగం టీవీ, కరీంనగర్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలంలోని గుమ్లాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం బుధవారం క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను సమీక్షించారు.
ముఖ్యమంత్రి రాక కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, బహిరంగ సభా ప్రాంగణాన్ని అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచనున్నట్లు సీపీ తెలిపారు. సభకు వచ్చే ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పక్కాగా పార్కింగ్ స్థలాలను కేటాయించారు. ట్రాఫిక్ మళ్లింపుపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సభా ప్రాంగణంలో తాగునీరు, ఇతర కనీస వసతులకు ఆటంకం కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
