బలగం టీవి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల :
- నిధుల లభ్యతను బట్టి దశలవారీగా సర్పంచులకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..
- ప్రతి పైసా ప్రజా సంక్షేమ కోసమే వెచ్చిస్తున్నాం..
-సిఎం అధ్వర్యంలో
వేములవాడ ఆలయ అభివృద్ధి పై సమీక్ష సమావేశం నిర్వహిస్తాం..
-రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క..
పంచాయతీ ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించే పరిస్థితి లేదని, దానికి సంబంధించి ఎట్లా చేయాలో అనేది ఇవాళ ,రేపు నిర్ణయిస్తామని,స్టేట్ ఫైనాన్స్ నిధులు ఇతర పనులకు వెచ్చించడం వల్లే సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు పెద్ద మొత్తంలో పెండింగ్ లో ఉన్నాయని,నిధుల లభ్యత బట్టి సర్పంచుల పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.గురువారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మంత్రి సీతక్క కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయ అతిథి గృహంకు చేరుకున్న మంత్రికి కలెక్టర్ అనురాగ్ జయంతి,ఎస్పి అఖిల్ మహాజన్ లుపూల మొక్కలు బహూకరించి సాదర స్వాగతం పలికారు.ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి,మొక్కులు చెల్లించుకున్నారు. అద్దాల మండపంలో మంత్రి కీ ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ ఈఓ కృష్ట ప్రసాద్ స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ విధంగా జరగలేదు అని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెంటనే దేవస్థాన అభివృద్ధికి సంబంధించిన సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు.మన పూర్వీకులు మనకు వారసత్వంగా ఇచ్చిన తెలంగాణలోని రాజన్న ఆలయం, సమ్మక్క – సారక్క జాతర, ఇతర ఆధ్యాత్మిక క్షేత్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందన్నారు.
వీటి ప్రాశస్త్యం దేశం మొత్తం తెలిసేలా విస్తృత ప్రచారం చేయడమే కాకుండా , ఇక్కడకు పెద్ద సంఖ్యలో వచ్చే, భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తామని రాజన్న ఆలయం అభివృద్ధిలో మేము భాగస్వామ్యం అవుతామని అన్నారు.
.ప్రతి నెల 5 వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లర్ ల వేతనాలు అందేలా చూస్తున్నామని,
తమ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే వెచ్చిస్తున్నట్లు అన్నారు.
ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుకున్నామని, . సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సజావుగా కొనసాగించెందుకు , ఆశీస్సులు అందించాలని , ప్రజలు సంతోషంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు.
సమ్మక్క- సారక్క జాతరకు ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం, పూజించడం మా అమ్మ, నాన్న , కుటుంబ సభ్యులకు ఆనవాయితీగా వస్తుందన్నారు.
మొదట ఇక్కడ మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఫిబ్రవరి లో జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు ఇక్కడి నుండి తీసుకెళ్లిన అక్షింతలు ,నైవేద్యాలను అక్కడ సమర్పిస్తామన్నారు. ఆది సీనన్న , మాది అన్న చెల్లెల్ల అనుబంధం అని శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆశీస్సులతో తను విప్, ఎమ్మెల్యే గా, నేను మంత్రిగా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు
