బలగం టీవీ, హైదరాబాద్:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగ్రవాదులను, పాకిస్థాన్ను తీవ్రంగా హెచ్చరించారు.
“భారత సార్వభౌమాధికారం వైపు కన్నెత్తి చూసినా, అలాంటి వారికి ఈ భూమి మీద నూకలు చెల్లినట్టే. భారతీయ వీర జవానులకు 140 కోట్ల దేశ ప్రజల మద్దతుంది. మా వీర జవానులు తలుచుకుంటే ప్రపంచ పటంలో మీ ఉనికి లేకుండా చేయగలరు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

“భారతీయ సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ను ఎవరూ ఆపలేరు. భారతదేశ రక్షణ కోసం మేమంతా ఒక్కటే. వీర జవానులు ఏ చర్య తీసుకున్నా అందుకు మద్దతుగా వారి వెంట నడవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు” అని ఆయన స్పష్టం చేశారు.
నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని పహల్గామ్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి చిత్రపటాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కతో కలిసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ, వీర జవానులకు దేశం అండగా నిలబడుతుందని ఉగ్రవాద ప్రేరేపిత పాకిస్థాన్కు గట్టిగా హెచ్చరించారు.
“భారత వీర జవాన్లకు అండగా నిలబడి, వారికి ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల ప్రతినిధులు, మాజీ ఆర్మీ అధికారులు, రాష్ట్ర పోలీసు అధికారులు, సచివాలయ ఉద్యోగులంతా వేలాదిగా ఈ సంఘీభావ ర్యాలీకి తరలివచ్చి మన సైనికులకు అండగా నిలిచినందుకు అందరికీ అభినందనలు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

“పాకిస్తాన్ ఉగ్రవాదులకు, పాకిస్తాన్ పాలకులతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఈ దేశ సార్వభౌమాధికారంపై దాడి చేయాలనుకున్న ప్రతి ఒక్కరికీ ఈ ర్యాలీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా వైపు కన్నెత్తి చూసినా ఈ భూమి మీద మీకు నూకలు చెల్లినట్టే. ఈ భూమి మీద నివసించడానికి మీరు అర్హత కోల్పోయినట్టే” అని ఆయన హెచ్చరించారు.
“మా శాంతిని, మా శాంతి ఆకాంక్షను, చేతగాని తనంగా ఎవరైనా భావిస్తే, మా భూ భాగంలో కాలుమోపి మా ఆడబిడ్డల నుదిటి సిందూరాన్ని తుడిచివేయాలని అనుకుంటే వారిని నేలమట్టం చేసే శక్తి మా వీర సైనికులకు ఉంది. వారికి 140 కోట్ల భారతీయులు అండగా నిలబడుతారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ ర్యాలీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు, మాజీ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు