బలగం టీవీ, రాజన్నసిరిసిల్ల:
మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లలోని 17వ బెటాలియన్లో మహిళల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 17వ బెటాలియన్ కమాండెంట్ ఎం.ఐ. సురేష్, ఏవో ఇ. ప్రమీల, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ, మహిళలకు సమాన హక్కులతో పాటు గృహ హింస నిరోధక చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 వంటి ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న హింసను నిరోధించడానికి ప్రభుత్వం అనేక శాఖల ద్వారా సహాయం అందిస్తోందని ఆమె వివరించారు. ప్రతి సంస్థ, విభాగంలో పది మంది కంటే ఎక్కువ మంది పనిచేస్తున్న ప్రదేశంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేయాలని, మహిళా సిబ్బంది తమ సమస్యలను ఈ కమిటీ ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు.

మహిళా సాధికారత కేంద్రం కోఆర్డినేటర్ రోజా మాట్లాడుతూ, మహిళలు లైంగిక, మానసిక, శారీరక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్నట్లయితే 181 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం ద్వారా వైద్య, న్యాయ, పోలీస్, కౌన్సిలింగ్ మరియు షెల్టర్ వంటి సహాయం పొందవచ్చని తెలియజేశారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని, ఆర్థికంగా ఎదగడం వల్ల కుటుంబం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు. మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేక రిజర్వేషన్లు ఏర్పాటు చేసిందని కూడా ఆమె గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఏవో, ఎఫ్ఎస్ఎల్ రమ్య మరియు మహిళా సిబ్బంది పాల్గొన్నారు.