బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటలో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, రైతులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయం, గ్రామ రెవిన్యూ రికార్డుల నిర్వహణతో పాటు, 20 వేల కోట్లతో 2 లక్షల వరకు రుణమాఫీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.

హన్మాజీపేట బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని, సన్న బియ్యం పంపిణీ, రైతులకు బోనస్ చెల్లింపులతో రైతులకు భరోసా కల్పిస్తున్నామని వివరించారు. ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకతీతంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.