బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- 30 రోజులలో భూమి మ్యూటేషన్ దరఖాస్తుల పరిష్కారం
- ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు
- మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక
– కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తంగళ్ళపల్లి, ఏప్రిల్ 26: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ స్పష్టం చేశారు. శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు, ప్రజలకు చట్టంలోని ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, భూముల సమస్యలను సమూలంగా పరిష్కరించే లక్ష్యంతో భూ భారతి (రికార్డు ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) చట్టం-2025 అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ చట్టం ద్వారా వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమి హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి 30 రోజుల్లో మ్యూటేషన్ పూర్తి చేస్తారని, ఒకవేళ నిర్ణీత గడువులో పూర్తి చేయకపోతే ఆటోమేటిక్గా మ్యూటేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.
భూముల రిజిస్ట్రేషన్ మరియు మ్యూటేషన్ సమయంలో తప్పనిసరిగా భూమి పట్టా ఉండాలని స్పష్టం చేశారు. మండలాల్లో లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా భూమి మ్యాప్ తయారైన తర్వాతనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియలు జరుగుతాయని చట్టంలో స్పష్టంగా పొందుపరిచామన్నారు. ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు యథావిధిగా భూ భారతి చట్టంలో కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. భూ హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణ కోసం అర్హులైన వారు నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి, జిల్లా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని, ఒకవేళ దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ లేదా భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు.
గతంలో ధరణి వ్యవస్థలో అభ్యంతరాలు ఉంటే నేరుగా సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ భూ భారతి చట్టం ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారి, కలెక్టర్, భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. అప్పీల్ వ్యవస్థ తీర్పుతో సంతృప్తి చెందకపోతేనే సివిల్ కోర్టుకు వెళ్లవచ్చని, అర్హులైన దరఖాస్తుదారులకు ప్రభుత్వం ఉచిత న్యాయ సలహా అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాల్లో వాటిని ప్రదర్శిస్తామని ఆయన పేర్కొన్నారు.
రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరిగానే భూమికి భూధార్ సంఖ్య కేటాయించే ఆలోచనలో ఉన్నామని, దీనివల్ల భూ ఆక్రమణలను అరికట్టవచ్చని అభిప్రాయపడ్డారు.
పెండింగ్లో ఉన్న సాదా బైనామాల పరిష్కారానికి భూ భారతి చట్టంలో అవకాశం కల్పించామని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు. పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.100 అపరాధ రుసుము వసూలు చేసి క్రమబద్ధీకరించి సర్టిఫికెట్ జారీ చేస్తామని, హక్కుల రికార్డుల్లో వివరాలు నమోదు చేసి పాస్ పుస్తకం అందజేస్తామని చెప్పారు.
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఇకపై ఒకే రోజు జరుగుతాయని స్పష్టం చేశారు. కొనుగోలు, దానం, తనఖా, బదిలీ, భాగంపంపకాల ద్వారా భూమిపై హక్కులు సంక్రమిస్తే తహసిల్దార్ రిజిస్ట్రేషన్ చేసి, హక్కుల రికార్డుల్లో మార్పులు చేసి పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేస్తారని అన్నారు. స్లాట్ బుకింగ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఫీజు చెల్లించిన తర్వాత నిర్ణీత తేదీల్లో చట్ట ప్రకారం సొంత దస్తావేజుతో పాటు భూమి పట్టాను కూడా సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
భూ భారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేశామని, ప్రజలు వాటిని క్షుణ్ణంగా చదవాలని, ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని కలెక్టర్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ రాధాభాయి, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నర్సింగం, తహశీల్దార్ జయంత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.






