బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
– ధరణి ఇబ్బందులు.. భూభారతితో దూరం
– ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
ధరణి చట్టంతో రైతులు, ప్రజలు పడ్డ ఇబ్బందులు నూతన భూభారతి చట్టంతో దూరం కానున్నాయని,భూభారతి చట్టం, రైతుల చుట్టం అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టంపై రుద్రంగి మండల కేంద్రం లో అవగాహన సదస్సును నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్,కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ధరణి చట్టం రావడం తో రైతులు, ప్రజలు ఇబ్బంది పడ్డారని,గత పదేండ్లు అసైన్డ్ కమిటీ లేకపోవడంతో ఇంకా చాలా కష్టాలు పడ్డారని అన్నారు. ధరణి ఇబ్బందులు దూరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర మంత్రులు, నిపుణులు, అధికారులు భూ భారతి చట్టాన్ని రూపొందించారని అన్నారు. భూముల విషయంలో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆశయమని అన్నారు. అతి తక్కువ కాలంలోనే భూ భారతి చట్టాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారని అన్నారు. వీటిలో ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఎదురైతే వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నామని అన్నారు. రైతును రాజును చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని, ఇందులో భాగంగానే రుణ మాఫీ,సన్న రకం ధాన్యం పండించే రైతులకు క్వింటాల్కు అదనంగా రూ ఐదు వందలు ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. సన్న రకం ధాన్యం తో సన్న బియ్యం పేదలు సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా ఉన్నారని అన్నారు.
అర్హుల భూ సమస్యల పరిష్కారం.. హక్కుల పంపిణీ.
జిల్లాలోని అర్హులైన వారందరీ భూ సమస్యలు భూ భారతి చట్టంలో భాగంగా పరిష్కరించి, హక్కులు పంపిణీ చేస్తామని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు.
అంతకముందు చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో భూ భారతి అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై భూ భారతి చట్టంపై రైతులు, ప్రజలకు ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడడుతూ క్షేత్ర స్థాయిలో నెలకొన్న భూ సమస్యలకు భూ భారతి ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని అన్నారు. మనుషులకు ఆధార్ నెంబర్ మాదిరిగా భూములకు భూధార్ నెంబర్ ఇస్తారని అన్నారు. సదస్సు అనంతరం స్థానిక రైతులు, ప్రజల సమస్యలు విని, దరఖాస్తులు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, చందుర్తి తాసిల్దార్ శ్రీనివాస్, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.