కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారంనాడు సాయంత్రం న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపికపై కిషన్ రెడ్డి పార్టీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు. నవంబర్ 1వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో బీజేపీ మూడో జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. మూడో జాబితాలో మహిళలు, బీసీలకు పెద్దపీట వేసే అవకాశం ఉంది. ఈ నెల 22న 52 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ నెల 27న బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి తనయుడు ఏపీ మిథున్ రెడ్డి పేరును బీజేపీ ప్రకటించింది. ఈ ఒక్క పేరుతోనే రెండో లిస్ట్ విడుదలైంది.మూడో జాబితా కోసం బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఇతర పార్టీల నుండి వచ్చే నేతలకు కూడ మూడో జాబితాలో టిక్కెట్ల కేటాయించే అవకాశం లేకపోలేదు.
ఇంకా 66 సీట్లను బీజేపీ ప్రకటించాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేయనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లను ఇవ్వాలని జనసేన కోరుతుంది. అయితే 10 అసెంబ్లీ సీట్లను జనసేనకు కేటాయించేందుకు బీజేపీ సుముఖంగా ఉంది.ఈ విషయమై పార్టీ అగ్రనేతలతో కిషన్ రెడ్డి చర్చించనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు చర్చించిన విషయం తెలిసిందే.
అభ్యర్ధుల జాబితా విడుదలలో బీఆర్ఎస్ ముందుంది. ఇంకా 19 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ ప్రకటించాల్సి ఉంది. బీజేపీ మాత్రం ఇంకా 66 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్ధులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు.