బలగం టీవీ, హైదరాబాద్:
జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ జవాన్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద వార్తతో కల్లితండాలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.
తల్లిదండ్రులకు మురళి నాయక్,ఏకైక సంతానం. ఇక సోమందేపల్లిలోని విజ్ఞాన్ స్కూల్ విద్యాభ్యాసం చేసిన వీర జవాన్, 2022లో ఇండియన్ ఆర్మీలో చేరాడు. నాసిక్లో శిక్షణ పొంది, జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహించి తిరిగి పంజాబ్ కు ట్రాన్స్ఫర్ అయ్యాడు. పంజాబ్లో పనిచేస్తుండగా భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు రోజుల క్రితం పంజాబ్ నుంచి జమ్మూకు విధుల నిమిత్తం వెళ్లాడు. అక్కడ పాక్ కాల్పుల్లో వీరమరణం పొందాడు.
మురళీ నాయక్ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. రేపు మురళీ నాయక్ పార్థివదేహం ఆయన స్వస్థలమైన కల్లితండాకు చేరుకోనుంది. తమ బిడ్డను కడసారి చూసుకునేందుకు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎదురుచూస్తున్నారు.