బలగం టీవీ, సిద్దిపేట:
బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డ్ కమాన్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక అని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లపాటు అభివృద్ధి పథంలో నడిపించిందని అన్నారు.
“బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను, ఈ అభివృద్ధిని ఊహించలేము. ఈరోజు మన పార్టీ పుట్టినరోజు. బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని సాధించిన పార్టీ. సమైక్య పాలకుల అణచివేత నుండి స్వతంత్రం కల్పించిన పార్టీ. ఇదే సిద్దిపేటలో 24 ఏళ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసింది. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను సంరక్షించింది మన పార్టీ. పదేండ్లు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపి దేశానికి దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ” అని హరీష్ రావు అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, వారు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, మహిళలకు రూ.2,500, రూ.4,000 పెన్షన్ వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
“కాంగ్రెస్ పార్టీ 420 హామీల అమలు కోసం ప్రశ్నిస్తూనే ఉన్నాం. రుణమాఫీ ఎప్పుడు చేస్తావు, 15,000 రైతుబంధు ఎప్పుడు ఇస్తావు అని కాంగ్రెస్ పై పోరాటం చేస్తూనే ఉన్నాం. మహిళలకు 2,500 ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాని ఊసే ఎత్తలేదు. 4,000 పెన్షన్ అసలే లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది” అని హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించడం, శిల్పారామం పనులను పెండింగ్లో పెట్టడం, ఎస్సీ గురుకుల పాఠశాలకు శాంక్షన్ చేసిన రూ.30 కోట్లను రద్దు చేయడం వంటి చర్యలను ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఆదాయం మందగించిందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“సిద్దిపేట అంటే ప్రభుత్వము ఓర్వలేని పరిస్థితి ఉంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అప్పుడు జరిగే అభివృద్ధిని మీరు అడ్డుకోలేరు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడింది. ఆదాయం మందగించింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంలో మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదు. గతి లేని శృతి లేని సంసారం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంది. అరిచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను కూడా అమలు చేయలేకపోతోంది” అని హరీష్ రావు అన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులకు హరీష్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “ఎవరు అవునన్నా కాదన్నా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.