బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు, చందుర్తి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వరంగల్కు భారీ ర్యాలీగా బయలుదేరారు.
సీనియర్ నాయకులు దీకొండ తిరుపతిరావు జెండా ఆవిష్కరణ చేసి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, రైతులు, బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగం, ఆయన ఇచ్చే సందేశం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నామని వారు తెలిపారు.
కేసీఆర్ సందేశాన్ని ప్రతి గ్రామానికి చేరవేస్తామని, బీఆర్ఎస్ను మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. “మార్పు మార్పు” అంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వారు ప్రకటించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, నిరుద్యోగ భృతి వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని వారు ఆరోపించారు. భూమిలేని నిరుపేదలకు, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, బత్తుల కమలాకర్, భక్తుల వంశీసిరికొండ, బత్తుల శ్రావణ్, లింగంపల్లి రాములు, కొమ్ము శంకర్, మర్రి రాములు తదితరులు పాల్గొన్నారు. “జై తెలంగాణ, జై జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.