బలగం టీవీ, వరంగల్:
వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏదేమైనా, ప్రపంచం తలకిందులైనా ప్రతి ఒక్కరూ సభకు చేరుకోవాల్సిందేనని, కేసీఆర్ ప్రసంగం వినాల్సిందేనని, మరోసారి మన ప్రభుత్వం రావాలని, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రతిజ్ఞ బూనుదామని హరీష్ రావు పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలకు వరంగల్ వేదికైందని, కేసీఆర్ ని చూడాలని, ఆయన ప్రసంగం వినాలని ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజని, బీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని ఆయన అన్నారు.
సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతాన్ని కేసీఆర్ అన్నపూర్ణగా మార్చారని, వలసలను ఆపి, దేశానికి ఆదర్శంగా నిలిపారని హరీష్ రావు కొనియాడారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని ఎగురవేసిన ఘనత బీఆర్ఎస్ దేనని ఆయన అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం కష్టపడి పని చేశామని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్, కేసీఆర్ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పాలనలో పాలు, నీళ్ల తేడా తెలిసిందని, కొత్త పథకాలు లేవని, ఉన్న పథకాలు బంద్ చేశారని హరీష్ రావు విమర్శించారు. స్కాలర్ షిప్స్, బతుకమ్మ చీరెలు, కేసీఆర్ కిట్లను నిలిపివేశారని, కాంగ్రెస్ శృతి లేని, గతి లేని ప్రభుత్వంగా మారిందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సంపద పెంచి పేదలకు పంచిందని, కాంగ్రెస్ వచ్చాక అన్ని రకాల ఆదాయాలు తగ్గాయని, పాలన వైఫల్యం వల్ల రాష్ట్ర ప్రగతి కుంటుపడిందని ఆయన అన్నారు.
రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవని, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ అమలు చేయలేదని, అసెంబ్లీలో మాట తప్పిన చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతులు కేసీఆర్ వైపు చూస్తున్నారని, రైతు రాజ్యం అంటే బీఆర్ఎస్ పాలన అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల ఖాతాల్లో నగదు వేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని ఆయన అన్నారు. రుణమాఫీ బంద్, రైతుబంధు బంద్, సాగునీరు కాదు తాగునీరు కూడా లేవని, దేవాదుల రిపేర్లు చేయకుండా లక్షల ఎకరాల్లో పంట ఎండబెట్టిందని ఆయన ఆరోపించారు.
సమ్మక్క సాగర్ కట్టినా, ఆరు ఏడు కోట్లు ఇవ్వక 6,7 వందల కోట్ల పంట ఎండబెట్టిందని, కృష్ణాలో నీళ్లున్నా పంటలు ఎండబెట్టిన చరిత్ర కాంగ్రెస్ దేనని హరీష్ రావు అన్నారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్ లలో నీళ్లు సకాలంలో వాడకపోవడం వల్ల పంటలు ఎండిపోయాయని ఆయన ఆరోపించారు. రైతుల కోసం కృష్ణా, గోదావరిపై ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ అని అన్నారు.
ఈ సభకు అంచనాలకు మించిన జనం వస్తున్నారని, కేసీఆర్ ఏం మాట్లాడుతారో వినాలనే ఉత్సాహం కాంగ్రెస్ నాయకులకే ఎక్కువగా ఉందని హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉద్యమకారులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు, రైతులు, విద్యార్థులు అందరూ రేపు జరిగే సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ట్రాఫిక్ జామ్ చేసి సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని, వాలంటీర్లు సమన్వయంతో ఉండాలని, అవసరమైతే అందరం ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమని నమ్మిన జయశంకర్ సార్ ది వరంగల్ అని, వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్నారని, స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాల నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ సభ నిర్వహిస్తున్నామని, సభ విజయవంతంగా జరిగేందుకు అందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. అంచనాలకు మించిన జనం వస్తున్నారని, ప్రభుత్వం, పోలీసులు కుట్ర చేసే అవకాశం ఉందని, అందరూ జాగ్రత్తలు పాటించాలని, ఓపికతో, స్వీయ క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు.

