నేడే నూతన సర్పంచుల ప్రమాణ స్వీకారం..
నూతన సర్పంచ్ ల పైన గ్రామాల ప్రజల ఆశలు
బలగం టీవీ, బోయినిపల్లి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని 23 గ్రామాలలో నేడు నూతన సర్పంచులతో పాటు పాలకవర్గం కొలువు తీరనుంది. గత రెండేళ్లుగా సర్పంచులు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడంతో పాటు పంచాయతీల్లో అవినీతి ఎక్కువ అయింది. దీంతో గ్రామాలలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురై, ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. గ్రామాలలో ప్రత్యేక అధికారులుగా నియామకమైన అధికారులు వారి వారి శాఖలలో పని భారం కూడా ఎక్కువ ఉండడంతో గ్రామపంచాయతీలను పట్టించుకోకపోవడంతో గ్రామపంచాయతీలో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డ సంఘటనలు చాలానే ఉన్నాయి. దీనికి తోడు కార్యదర్శులు, మల్టీ పర్పస్ వర్కర్లపై ఆధారపడడం, పని భారం కార్యదర్శులు తగ్గించుకోవడంతో మల్టీపర్పస్ వర్కర్లు ప్రతి దాంట్లో అవినీతికి పాల్పడుతూ అందిన కాడికి దండుకున్నట్టు గుసగుసలు వినపడ్డాయి. మల్టీపర్పస్ వర్కర్లపై ఆధారపడడంతో కొన్ని గ్రామాలలో ప్రజలకు కార్యదర్శి తెలవకపోవడం గమనార్హం. నూతనంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న సర్పంచులు గ్రామపంచాయతీలలో జరిగే అవినీతికి అడ్డుకట్ట వేసి, గ్రామ ప్రజలకు చేరువవుతూ గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
