బలగం టీవీ, హైదరాబాద్:
భారత్ – పాకిస్థాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు భారత్ విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ప్రకటించారు. సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ధృవీకరించారు. మధ్యాహ్నం 3.15 గంటలకు భారత్ డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్రీ తెలిపారు. ఈనెల 12న సాయంత్రం 5 గంటలకు మరోసారి ఇరుదేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు తెలిపారు.
భారత్-పాక్లతో జరిపిన చర్చలపై అమెరికా కార్యదర్శి రూబియో స్పష్టతనిచ్చారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో కలిసి ఇరుదేశాలతో చర్చలు జరిపినట్లు ప్రకటించారు. ఇరుదేశాల ప్రధానమంత్రులతో పాటు భారత్ విదేశాంగశాఖ మంత్రి జై శంకర్, అజిత్ దోవల్ తో, పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్, పాక్ ఎన్ఎస్ఏ మాలిక్ తోనూ చర్చలు జరిపామన్నారు. అమెరికా దౌత్యంతో భారత్ – పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని రూబియో స్పష్టం చేశారు.