బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకం కాదు..
- తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ( TPTF) రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF) జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, ఉద్యోగులు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఢిల్లీలో తెలంగాణ ప్రజలను దొంగలుగా చూస్తున్నారని వ్యాఖ్యానించడం శోచనీయమని అన్నారు. ఉద్యోగులు తెలంగాణ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకం కాదని, వారు కూడా ప్రజలలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ ప్రోగ్రాం టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో దుమాల రమానాధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగుల జీ.పీ.ఎఫ్, టీఎస్జీఎల్ఐలో సొమ్మును సంవత్సరాలుగా చెల్లించకుండా పెండింగ్లో ఉంచడం, రిటైర్డ్ పెన్షనర్ల ప్రయోజనాలను అందించకపోవడం దుర్మార్గమని రమానాధ్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలను డిమాండ్గా చేసుకొని ఉద్యమిస్తున్నారని, అయితే ప్రభుత్వం గత 15 నెలలుగా చర్చలు జరిపినప్పటికీ ఉద్యోగులకు మొండిచెయ్యి చూపిస్తోందని ఆరోపించారు. ఉద్యోగ జె.ఎ.సీ. ప్రభుత్వం ముందు పెట్టిన 57 డిమాండ్లలో 40 ఆర్థికేతరమైనవేనని, అయినప్పటికీ ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
రాష్ట్ర ఆర్థిక దివాళాకు పాలకుల అడ్డగోలు ఖర్చులే కారణమని, అడ్వర్టైజ్మెంట్లు, హెలికాప్టర్ ప్రయాణాలపై ఖర్చులను తగ్గించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని రమానాధ్ రెడ్డి సూచించారు. ఉద్యోగులను బెదిరించి, ప్రజలకు ఉద్యోగులకు మధ్య చిచ్చు పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఉద్యోగులు తమ హక్కుల కోసం న్యాయపరంగా పోరాడుతూనే ప్రజల సంక్షేమం కోసం నిలబడతామని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో TPTF జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ఉపాధ్యక్షులు హనుమాన్లు దబ్బెడ, మందాడి శ్రీనివాసరెడ్డి, నూగురి దేవేందర్, జిల్లా కార్యదర్శి మైలారం తిరుపతి, వేములవాడ అర్బన్ మండల అధ్యక్షులు బొజ్జ కృష్ణ, వేములవాడ రూరల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దూస సంతోష్, తంగళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి మధుసూదన్, జిల్లా కౌన్సిలర్ చకినాల భాస్కర్లు పాల్గొన్నారు.