బలగం టీవీ, తిరుమల:
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. తిరుమలలోని రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో అనూహ్యంగా ఓ పాము ప్రత్యక్షమై భక్తురాలిని కాటేసింది.
తెలంగాణకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం కోసం రూ. 300 క్యూలైన్లో నిలబడ్డారు. ఆ సమయంలో ఒక్కసారిగా వచ్చిన పాము ఆమె కాలుపై కాటు వేసింది. దీంతో భయాందోళనకు గురైన మౌనిక కేకలు వేయడంతో తోటి భక్తులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు.
ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది బాధితురాలిని ప్రథమ చికిత్స నిమిత్తం తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం, మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచన మేరకు ఆమెను వెంటనే తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
