- తక్కువ పెట్టుబడితో అధిక లాభాల పేరుతో ₹7 లక్షలు మోసం
- జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే..
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను రాజస్థాన్లోని జైపూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఈరోజు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్తర్ప్రదేశ్కు చెందిన కపిల్ శర్మ (21), పంకజ్ కౌశిక్ (24) అనే నిందితులు ‘XTcoin.Com’ వెబ్ అప్లికేషన్ లింక్ను వాట్సాప్ ద్వారా పంపి, ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని అంటూ మోసాలకు పాల్పడుతున్నరని అన్నారు.
చందుర్తి మండలం, దేవుని తండా గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుగులోతు రమేష్ (జలపతి కుమారుడు) డిసెంబర్ 8, 2024న ఈ మోసానికి గురయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న రమేష్కి నిందితులు ‘XTcoin.Com’ లింక్ను పంపారు. మొదట రూ. 2,500 పెట్టుబడి పెట్టిన రమేష్, మరుసటి రోజు తన పెట్టుబడికి రెట్టింపు లాభాలు కనిపించడంతో ఇది నిజమని నమ్మాడు. దీంతో దశలవారీగా మొత్తం రూ. 7,32,000 పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల తర్వాత డబ్బు విత్డ్రా చేయడానికి ప్రయత్నించగా కుదరలేదు. కొద్ది రోజుల తర్వాత వెబ్సైట్ పూర్తిగా మూసివేయబడింది. తాను మోసపోయానని గ్రహించిన రమేష్ వెంటనే చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
చందుర్తి ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాల మేరకు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, సైబర్ క్రైమ్ ఎస్సై జునైద్, హెడ్ కానిస్టేబుల్ గంగారాం, కానిస్టేబుల్ మహేష్లతో కూడిన ప్రత్యేక బృందం సాంకేతిక ఆధారాలతో రాజస్థాన్లోని జైపూర్లో నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేసి, ఈరోజు రిమాండ్కు తరలించడం జరిగిదని ఎస్పీ తెలిపారు.
నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందాన్ని ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు.
