బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనాథలు, నిరాశ్రయులు మరియు ఆర్థికంగా వెనుకబడిన 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన బాలికలకు హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థలో 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందే అవకాశం లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సంస్థలో సివిల్ ఇంజనీరింగ్ (60 సీట్లు), ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ (60 సీట్లు), కంప్యూటర్ ఇంజనీరింగ్ (60 సీట్లు), ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (60 సీట్లు) విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కలిగిన బాలికలు తమ 10వ తరగతి మార్కుల మెమోతో పాటు కుల ధ్రువీకరణ పత్రం (అనాథలు కానివారు), ఆదాయ ధ్రువీకరణ పత్రం (అనాథలు కానివారు), తల్లిదండ్రుల మరణ ధ్రువీకరణ పత్రం (అనాథల విషయంలో), బోనఫైడ్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మరియు స్టడీ సర్టిఫికేట్లను సంబంధిత దరఖాస్తు ఫారంతో జతచేసి సమర్పించాల్సి ఉంటుంది.
పూర్తి చేసిన దరఖాస్తులను 2025 మే 20వ తేదీ లోపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్దుల శాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందజేయాలని కలెక్టర్ సూచించారు.