బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రజక కులానికి చెందిన రెండు నెలల పసిబిడ్డను అతికిరాతకంగా హత్య చేసిన ఘటనపై రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జిల్లా రజక సంఘం అధ్యక్షులు దుబ్బాక రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నాడు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
హంతకులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు రజక మరియు బహుజన సంఘాల నాయకులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, మృ*తి చెందిన పాపకు కన్నీటి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నేతలతో పాటు ఎస్సీ, ఎస్టీ సంఘాల అధ్యక్షులు, మహిళా విభాగం మరియు యూత్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. “బహుజనుల జోలికి వస్తే మీ భవిష్యత్తు లేకుండా చేస్తాం. అగ్రవర్ణ గుండాల అరాచకాలను ఉపేక్షించేది లేదు.” దుబ్బాక రమేష్, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు.
ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ మాట్లాడుతూ. పసిబిడ్డను ప్రాణాలు తీసిన హంతకులకు కఠిన శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
