బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పలు గ్రామాల్లో పర్యటించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు. ఎస్పీ జిల్లాలోని పలు కీలక గ్రామాలలో పర్యటించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు.
వీర్నపల్లి, కంచెర్ల, గర్జనపల్లి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. అలాగే ఎల్లారెడ్డిపేట, వెంకటాపుర్, గొల్లపల్లి, బొప్పపూర్ గ్రామాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి ఎస్పీ పలు భద్రతాపరమైన సూచనలు చేశారు.
ఓటర్లు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని, పోలింగ్ కేంద్రాల వద్ద గుంపులు ఉండకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు నిఘా ఉంచాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం గస్తీ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలని సిబ్బందిని కోరారు.
ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, పోలీసు యంత్రాంగం ప్రజలకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఎస్పీ భరోసా ఇచ్చారు.





