– మెడికవర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్
బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆర్థోపెడిక్ మరియు ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ సూచించారు.
శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మోకాళ్ల నొప్పులు ప్రస్తుతం వయోవృద్ధులకే కాకుండా యువతలో కూడా అధికంగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఎక్కువసేపు నిలబడటం, అధిక బరువు, క్రీడలలో గాయాలు, కాల్షియం లోపం వంటి కారణాల వల్ల ఈ సమస్యలు వస్తాయని చెప్పారు. ప్రారంభ దశలోనే వైద్యం తీసుకుంటే శస్త్రచికిత్స అవసరం లేకుండా మందులు, ఫిజియోథెరపీ ద్వారా నయం చేసుకోవచ్చన్నారు.
మోకాళ్లలో వాపు, కదిలించేటప్పుడు చప్పుళ్లు రావడం, మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సమస్య తీవ్రమైతే ఆర్థోస్కోపీ వంటి ఆధునిక చికిత్సలతో వేగంగా కోలుకునే అవకాశముందని వివరించారు. ప్రస్తుతం మెడికవర్ ఆసుపత్రిలో ఆధునిక పరికరాలతో తల నుంచి పాదాల వరకు అన్ని రకాల శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం, నియమిత వ్యాయామం, బరువు నియంత్రణతో మోకాళ్ల సమస్యలను తగ్గించుకోవచ్చని సూచించారు.
మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, లక్ష్మీరాజం, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

