బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
చిన్న నిర్లక్ష్యం పెను ప్రమాదం! పిల్లలను నీటి వనరులకు దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి
వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు, యువకులు ఈత కోసం చెరువులు, కాలువలు, కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఈత సరదా కొన్నిసార్లు విషాదంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్ సూచించారు.
ఈత రానివారు ఒంటరిగా బావులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. ఈత నేర్చుకునే వారు తప్పనిసరిగా తమ తల్లిదండ్రుల సమక్షంలోనే నేర్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను చెరువులు, కాలువలు, కుంటల వంటి నీటి వనరుల వద్దకు వెళ్లకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, వారి భద్రతకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు. ఈత సరదాను విషాదంగా మార్చకుండా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
