బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు జలాశయము, ఎగువ మానేరు జలాశయము మరియు అన్నపూర్ణ రిజర్వాయర్ పరిసర ప్రాంత లైసెన్సుదారులకు ముఖ్య గమనిక డైరెక్టర్, మత్స్యశాఖ, హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం మెమో నెం. 1683/C2/2020; తేది: 01.07.2020 ప్రకారం, ప్రతి సంవత్సరం జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు చేపలు పట్టుట నిషేధించబడుతుంది.
ఈ సంవత్సరం కూడా, మధ్య మానేరు జలాశయము, ఎగువ మానేరు జలాశయము మరియు అన్నపూర్ణ రిజర్వాయర్లలో జూలై 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు చేపలు పట్టుట మరియు అమ్మడం నిషేధించబడింది. ఈ రెండు నెలల కాలంలో చేపలు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుంటాయి. దీనివల్ల జలాశయాలలో చేపల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది, తద్వారా తర్వాతి కాలంలో మత్స్యకారులు ఎక్కువ సంఖ్యలో చేపలు పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, లైసెన్సుదారులు మరియు వివిధ ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు తమ తమ సంఘాల పరిధిలోని గ్రామాలలోని సభ్యులకు, మత్స్యకారులకు చేపలు పట్టకూడదని తెలియజేయాలని కోరడమైనది.
నిషేధిత కాలంలో ఎవరైనా పైన పేర్కొన్న జలాశయాలలో లేదా వాటి పరిసర ప్రాంతాలలో చేపల వేట నిర్వహిస్తే, వారి వలలు, తెప్పలు మరియు ఇతర వేట పరికరములు జప్తు చేయబడతాయి. అంతేకాకుండా, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ అధికారి తెలియజేశారు.
