బలగం టీవీ, సంగెం:
కాపుల కనపర్తి రైతు సేవా సహకార సంఘం పరిధిలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, దీనిపై మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సంగెం మండలం గవిచర్ల గ్రామం గుండా వెళ్తున్న దయాకర్ రావు వాహనాన్ని ఆపి, అక్కడ ఉన్న రైతులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు.
రైతులు తమ బాధను వివరిస్తూ, “సాగునీరు రాక, ఎరువుల కొరతతో అప్పుల పాలవుతున్నాం. మార్పు మార్పు అని మోసపోయాం, ఇప్పుడు ఎరువులు రాక ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాం. అందరి కడుపు నింపే రైతే ఎరువుల కోసం పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల గోడు విన్న దయాకర్ రావు, అక్కడే ఉన్న ఎరువుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అసమర్థ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాని అన్నారు.
