బాధ్యతగా వ్యవహరించి రోడ్డు ప్రమాదాలు నివారిద్దాం.
డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి.
మద్యం సేవించి డ్రైవింగ్, ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ కు పాల్పడితే కఠిన చర్యలు.
- జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే.
బలగం టీవీ, ఎల్లారెడ్డిపేట:
రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ వారి ఆధ్వర్యంలో అశ్విని హాస్పిటల్స్ సహకారంతో మండల పరిధిలోని వివిధ వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే హాజరై శిబిరాన్ని ప్రారంభించి,అవసరమైన డ్రైవర్లకు ఉచిత కళ్లద్దాలు, మందులు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రైవర్ల భద్రతే ప్రజల భద్రతని,ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని,ప్రతి వాహనాదారుడు సామాజిక బాధ్యతగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. దీర్ఘకాలం వాహనాలు నడిపే డ్రైవర్లు కంటి చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.స్పష్టమైన చూపు లేకపోవడం కూడా రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుందని తెలిపారు. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ మరియు రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలని,ద్విచక్ర వాహనం నడిపే సందర్భల్లో తప్పక హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, ఓవర్ స్పీడ్, ఓవర్ లోడింగ్, ర్యాష్ డ్రైవింగ్,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దూర ప్రయాణాలు చేసే డ్రైవర్లు అలసటగా ఉన్నప్పుడు వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని, ప్రతి మూడు నెలలకొకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని,అన్ని మండల కేంద్రాల్లో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అశ్విని హాస్పిటల్ యాజమాన్యానికి,డాక్టర్ అభినయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ శ్రీనివాస్, ఎస్.ఐ లు రాహుల్ రెడ్డి, లక్ష్మణ్, సిబ్బంది వాహనాల డ్రైవర్లు పాల్గొన్నారు.









