బలగం టీవీ, ఇల్లంతకుంట:
ఇల్లంతకుంట మండలంలోని అనంతారం గ్రామంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.సర్పంచ్ వొల్లాల రజిత వెంకటేశం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో కరీంనగర్ అపెక్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్,ఆద్య చిల్డ్రన్స్ హాస్పిటల్ వైద్యుల నేతృత్వంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఈ శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్లు ఎండి అల్మాస్ తాలిబ్, ఎండి భరత్ వైద్య సేవలు అందించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన శిబిరంలో సుమారు 300 మందికి ఈసీజీ, జీఆర్బీఎస్, షుగర్, బీపీ తదితర పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉచిత మందులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజల ఆరోగ్యం తమకు అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. ప్రతి ఒక్కరు తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి నివారించుకోవచ్చన్నారు. అవసరమైనప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నియంత్రించుకోవచ్చని సూచించారు. శిబిరం ఏర్పాటు చేసిన వైద్య బృందానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కదం జయంత్, వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
