బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని సర్వే చేశారు, ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేశారు అని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో లక్ష్యం మేరకు ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. బుధవారం ఇందిరమ్మ ఇండ్ల పథకంపై జిల్లాలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయా మున్సిపాలిటీలు, మండలాల వారిగా లక్ష్యం మేరకు ఎంత పూర్తి చేశారో సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ అర్హులైన పేదల సొంత ఇంటి కల సాకారం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందనిఅన్నారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, అర్హులకే అందేలా చూడాలని అన్నారు. జిల్లాలోని ఆయా మున్సిపాలిటీలు, మండలాల్లో మొత్తం 7690 దరఖాస్తులు అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేశారని, వీటిలో ఇప్పటిదాకా 5776 వారి వివరాలు ఆన్లైన్ చేశారని అన్నారు. మిగతా వివరాలు పరిశీలిస్తున్నారని,అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందించాలని అన్నారు. వచ్చే నెల 2వ తేదీన ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల వార్డుల్లో దరఖాస్తుదారు జాబితా ప్రదర్శిస్తారని, 5వ తేదీన తుది జాబితా ప్రదర్శిస్తారని,అధికారులు సమన్వయంతో పని చేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో సిరిసిల్ల ఆర్డీవో రాధాబాయి, డీఆర్డీఓ శేషాద్రి, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.