బలగం టీవీ, హైదరాబాద్:
భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో అందాల పోటీల నిర్వహణపై సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే అందాల పోటీలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో విశ్వహిందూ పరిషత్ పోటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అంతర్జాతీయ ఈవెంట్ మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలు ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యము వహిస్తోంది. మే 10 నుంచి 31వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ పోటీలకు ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసింది. 120కి పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు, స్పాన్సర్స్ ఈ ఈవెంట్ లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు దేశాల అందాల భామలు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ క్రమంలో అందాల పోటీల నిర్వహణ పై సస్పెన్స్ నెలకొంది. పాకిస్థాన్- భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపధ్య్మలో పోటీలను నిర్వహించాలా..వద్దా అనే ఆలోచనలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు మరికాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.