- రేపు తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ
- తేది 21-12-2025 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న సమావేశం
- తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’ పై కేసీఆర్ దిశానిర్దేశం
- పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై తీవ్ర ఆగ్రహం
- నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ కేంద్రం వద్ద మోకరిల్లిందని విమర్శ..
- నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపణ
- బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయాల్లో రేపు మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ (LP), రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. తేది 21-12-2025 మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణతో పాటు రాష్ట్ర ప్రయోజనాలపై కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
పొరుగు రాష్ట్రం ఏపీ చేస్తున్న జల దోపిడీ, దానిని అడ్డుకోవడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణే ధ్యేయంగా ‘మరో ప్రజా ఉద్యమం’ చేపట్టేలా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు 91 టీఎంసీలను కేటాయిస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరించడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వద్ద కాంగ్రెస్ మోకరిల్లి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఆయన విమర్శించనున్నారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం ఏపీ జల దోపిడీకి సహకరిస్తోందని, దీనివల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణం మరియు భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై, రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశంలో కేసీఆర్ కీలక దిశానిర్దేశం చేయనున్నారు.

