బలగం టీవీ, హైదరాబాద్:
మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్న కేటీఆర్
ఇండియా సాధిస్తున్న ప్రగతిని వివరించనున్న కేటీఆర్
ఇంగ్లాండ్ లోని ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో 2025 జూన్ 20, 21 తేదీల్లో సమావేశాలు
“భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్తో ఈ సంవత్సరం ఈ సదస్సు జరగనుంది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ మాట్లాడుతూ, కేటీఆర్ తన అనుభవాలు, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా ఉంటాయని, భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని తెలిపారు.
ప్రపంచ సమస్యలను పరిష్కరించడంతో పాటు భారతదేశంలోని స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. కేటీఆర్ వివిధ దేశాల విద్యార్థులు, అధ్యాపకులు, నిపుణుల సమక్షంలో భారతదేశ ప్రగతిపథాన్ని, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలను, టెక్నాలజీ ఆధారిత అభివృద్ధి మోడల్ను వివరించనున్నారు.
ఈ సదస్సులో కేటీఆర్ పాల్గొంటే రాబోయే రోజుల్లో ప్రపంచంపై ఇండియా చూపే సానుకూల ప్రభావాన్ని, నాయకత్వ లక్షణాలను ప్రపంచానికి బలంగా చాటొచ్చని సిద్ధార్థ్ సేఠీ తెలిపారు. ఈ ఆహ్వానాన్ని స్వీకరించి, సదస్సుకు రావాలని ఆయన కోరారు.
ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ సమావేశం యూరప్లో భారత్కు సంబంధించిన అతి పెద్ద కార్యక్రమం. ఇది భారతదేశ పురోగతి, ఆవిష్కరణలను ప్రపంచానికి చూపే వేదిక. మనదేశ అభివృద్ధి, సాంకేతిక రంగాల్లో జరుగుతున్న మార్పులు, గ్లోబల్ సహకార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగనున్నాయి. భారత్ను ప్రపంచానికి దగ్గర చేయడం, పరిశోధన, సాంకేతికత, విధానాల్లో ఇతర దేశాల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ ఫోరమ్ ప్రధాన లక్ష్యం.
