మల్లయ్య కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిన కేటీఆర్
బలగం టీవీ, సూర్యపేట:
తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ (BRS) కార్యకర్త ఉప్పుల మల్లయ్య కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం రోజు పరామర్శించారు. ఇటీవల కాంగ్రెస్ శ్రేణుల దాడిలో మృతి చెందిన మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని మల్లయ్య నివాసానికి చేరుకున్న కేటీఆర్, మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మల్లయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్టకాలంలో పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.మృతుడి కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ. 5 లక్షల (ఐదు లక్షల రూపాయల) ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ స్వయంగా అందజేశారు.
లింగంపల్లి గ్రామంలో కాంగ్రెస్ శ్రేణుల చేతిలో హత్యకు గురైన ఉప్పల మల్లయ్య మృతి బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదాన్ని నింపింది. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


