బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
- జిల్లా మత్స్యశాఖ అధికారి
రుద్రవరం గ్రామంలోని కమ్యూనిటీ హాల్లో మధ్య మానేరు జలాశయం పరిధిలోని చేపలు పట్టు లైసెన్సు దారుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైసెన్స్ దారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు.
ఈ సందర్భంగా పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై లైసెన్స్ దారులు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మొదటి తేదీ నుండి తమ లైసెన్సులను రెన్యువల్ చేసుకోవాలని లేదా కొత్త లైసెన్సులు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం తగిన రుజువులు జతచేసి, మత్స్యశాఖ, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయంలో లైసెన్స్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
మధ్య మానేరు జలాశయంలో చేపలు పట్టుకునే లైసెన్స్ దారులకు తెప్పలు, వలలను సబ్సిడీపై అందించే విషయాన్ని పరిశీలించాలని జిల్లా మత్స్య శాఖ అధికారిని కోరారు.
చేపల వేట నిషేధ కాలమైన జూలై మరియు ఆగష్టు నెలల్లో మధ్య మానేరు జలాశయం పరిధిలోని మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జలాశయంలో నీటి నిల్వలు 10 టీఎంసీలకు తగ్గినప్పుడు, భూములు కోల్పోయిన నిర్వాసిత లైసెన్స్ దారులకు మాత్రమే చేపలు పట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని జిల్లా మత్స్యశాఖ అధికారిని కోరారు.
ఈ అవగాహన సదస్సులో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీమతి యం. సౌజన్య, జిల్లా మత్స్య పారిశ్రామిక సహాకార సంఘం అధ్యక్షులు శ్రీ చొప్పరి రామ చంద్రం, జిల్లా డైరెక్టర్లు, లైసెన్స్ దారులు, మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
