బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
జమ్మూ కాశ్మీర్లోని పహాల్గంలో హిందువులను ఉగ్రవాదులు హత్య చేయడాన్ని ఖండిస్తూ ఎల్లారెడ్డిపేటలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతంగా ముగిసింది. వర్తక, వాణిజ్య సంస్థలు, హోటల్ యజమానులు స్వచ్ఛందంగా బంద్కు సహకరించారు. బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలిపింది.
బంద్ సందర్భంగా నిరసనకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు యువకులు పాకిస్తాన్ చిత్రపటాన్ని దహనం చేసి, రోడ్డుపై వేసి తొక్కారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి నాయకులు మాట్లాడుతూ, పహాల్గంలో అమాయక హిందువులను మతం పేరుతో లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోందన్నారు. చిప్ప పట్టుకుని ప్రపంచమంతా తిరుగుతున్న పాకిస్తాన్ ఈ దుశ్చర్యకు పాల్పడటం సిగ్గుమాలిన చర్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భారతీయులందరూ మద్దతుగా ఉంటారని వారు స్పష్టం చేశారు. ఈ ఉగ్రదాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.