బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత
గత పది రోజులుగా పెరుగుతున్న వేడి గాలులు, ఎండ తీవ్రత దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. రజిత సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు, వ్యవసాయ పనులు మానుకోవాలని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళితే తల రుమాలు, గొడుగు, టోపీ ధరించాలని, లేత రంగు దుస్తులు వేసుకోవాలని, నీరు వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
వడదెబ్బ తగిలితే జ్వరం, తల తిరగడం, చెమట అధికంగా పోవడం, అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదా ఆరోగ్య ఉప కేంద్రానికి వెళ్లాలని లేదా ఆశా కార్యకర్తను సంప్రదించి ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని సూచించారు.
వేడిగాలుల వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, చెరుకు రసం వంటి పానీయాలు తీసుకోవాలని, ప్రతి గంటకు ఒక గ్లాసు నీరు త్రాగాలని, ఎయిర్ కూలర్లు, ఏసీలు ఉపయోగించాలని పేర్కొన్నారు. వడదెబ్బ తగిలిన వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి చికిత్స పొందాలని తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తుల విషయంలో కుటుంబ సభ్యులు మరింత జాగ్రత్త వహించాలని డాక్టర్ రజిత విజ్ఞప్తి చేశారు.