బలగం టీవీ, వేములవాడ :
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు ఇచ్చారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా రుద్రంగి, మానాలలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని,ఇప్పటికే అన్ని మండలాల్లో నూతన చట్టం గురించి అవగాహన కల్పించామని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుద్రంగి మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారని,ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చని అన్నారు.
రెవెన్యూ సదస్సుల్లో ప్రభుత్వపరంగా నిర్ణీత ప్రొఫార్మాలో ప్రింట్ చేసిన దరఖాస్తులను అందజేయడం జరుగుతుందనిఅన్నారు. భూ సమస్యలను పరిష్కరించుకుని, భూ వివాదాలు లేని గ్రామాలుగా పల్లెలను తీర్చిదిద్దుకోవాలనిఅన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్న రెవెన్యూ సదస్సులను మండలంలోని అన్ని గ్రామాల రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పైలెట్ మండలంలోని ఆయా రెవెన్యూ గ్రామాలలో ఈ నెల 15 వ తేదీ వరకు సదస్సులు పూర్తయ్యాక, జిల్లాలోని మిగతా అన్ని మండలాలలో రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు.దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. సదస్సులో రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు వేగంగా చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని బాలానగర్ లోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణను పరిశీలించి, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి మానాలలోని కొనుగోలు కేంద్రాన్ని డీఆర్డీఓ శేషాద్రి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. సేకరించిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని, కొనుగోళ్లలో వేగం పెంచాలని ఆదేశించారు.