బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
శృంగేరి పీఠాధిపతి ఆమోదంతో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులు ప్రారంభం
ఖ్యాతిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామి వారు ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కమిషనర్ శ్రీధర్ లు శృంగేరి పీఠాధిపతిని కలిసి ఆలయ విస్తరణ ప్రణాళికను వివరించారు.
శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి తీర్థ స్వామి వారు ఆలయ నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో కూడా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి అర్చకులచే ఏకాంతంగా యధావిధిగా పూజలు కొనసాగుతాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవలు భీమేశ్వర ఆలయంలో జరుపబడుటకు తాత్కాలికంగా క్యూలైన్ల నిర్మాణం, అభిషేక మండపాలు, కళ్యాణ మండపాల నిర్మాణం కోసం అనుమతులు మంజూరు చేశారు.
గత నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇతర మంత్రుల సమక్షంలో రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు శంకుస్థాపన చేశారు. తదుపరి ఆలయ విస్తరణ టెండర్ల ప్రక్రియలో భాగంగా, తుది నమూనాలను శృంగేరి పీఠాధిపతికి సమర్పించి వారి ఆమోదం పొందారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, శృంగేరి పీఠాధిపతి ఆశీస్సులతో ఆలయ విస్తరణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు.
ఈ సమావేశంలో ఎండోమెంట్ సలహాదారు గోవిందా హరి, ఆర్&బి సిఈ రాజేశ్వర్ రెడ్డి, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ మూర్తి, అర్చకులు శరత్, సురేష్, శృంగేరి పీఠం తెలంగాణ బాధ్యులు రాధాకృష్ణ శర్మ, ఏఈ రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.


