బలగం టీవీ, హైదరాబాద్:
కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ స్వాగతించింది. అయితే, ఈ ప్రక్రియ పకడ్బందీగా జరగాలని, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్మీట్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఈ విషయాలను వెల్లడించారు.
కులగణనను స్వాగతిస్తున్నామని, అయితే చేతులు దులుపుకునే విధంగా కాకుండా, పకడ్బందీగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చట్టసభల్లో, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తెలంగాణలో బీసీ గణనలో తప్పులున్నాయని, దానిని కేంద్రం ఆదర్శంగా తీసుకోకుండా, పకడ్బందీగా కులగణన చేపట్టాలని సూచించారు. కేంద్రం పార్లమెంట్ లో తీర్మానం పెడితే రాజ్యసభ లో బీ ఆర్ ఎస్ మద్దతు ఇస్తుందని తెలిపారు. బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను విస్మరించిందని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేయడంలో బీఆర్ఎస్ చిత్తశుద్ధితో ఉందని, కేసీఆర్ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ వల్లే కేంద్రం కులగణనకు ఒప్పుకుందని కాంగ్రెస్ చెప్పడం సరికాదని, బీఆర్ఎస్ ఎప్పటినుంచో కులగణన కోసం డిమాండ్ చేస్తోందని లింగయ్య యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల్లో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని అంజయ్య యాదవ్ డిమాండ్ చేశారు.