బలగం టీవీ, హైదరాబాద్:
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నిలువెల్లా విషం నింపుకున్నారని, అందుకే కేసీఆర్పై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. పదో తరగతి ఫలితాలను కూడా రేవంత్ రెడ్డి రాజకీయంగా వాడుకున్నారని, విద్యార్థుల ముందు సీఎం రోత మాటలు దిగజారుడుతనానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ పథకాల అమలుపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన హరీష్ రావు, కాంగ్రెస్ పదేళ్లు అధికారం అనేది పగటి కల అని అన్నారు. ముందు రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలని హితవు పలికారు. బసవేశ్వరుడి జయంతిని కూడా చిల్లర రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు.
రవీంద్ర భారతిలో ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అడ్డగోలుగా రాజకీయాలు మాట్లాడారని ఆరోపించారు. పదో తరగతి ఫలితాల విడుదలను కూడా తన రాజకీయ అవసరానికి వాడుకున్నారని విమర్శించారు. ఫలితాల కోసం ఎదురుచూసే పిల్లల జీవితాలతో వారం రోజులుగా తేదీలు మార్చి, టైమింగ్స్ మార్చి ఆడుకున్నారని ఆయన అన్నారు. విద్యార్థులను ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి స్థాయిని, హోదాను దిగజార్చారని హరీష్ రావు దుయ్యబట్టారు.
“అచ్చోసిన ఆంబోతు అంటడు, సమాధి అంటడు కనీసం సోయి లేకుండా మాట్లాడిండు. ఇదేనా విద్యార్థులకు నువ్వు చెప్పేది రేవంత్ రెడ్డి, నువ్వా విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేది?” అని ప్రశ్నించారు. రవీంద్ర భారతిలో రాజకీయాలు మాట్లాడి దాని గౌరవాన్ని తగ్గించారని ఆయన ఆరోపించారు. రజతోత్సవ సభను చూసినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని, కళ్లలో, కడుపులో మాత్రమే కాదు నిలువెల్లా విషం నింపుకున్నాడని హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ గురించి చిల్లర మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి కుక్క తోక వంకరే అని మరోసారి రుజువు చేసుకున్నారని అన్నారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదని, ఉద్యమం చేసి, రాష్ట్రం ఇచ్చే అనివార్య పరిస్థితిని కాంగ్రెస్ కు కేసీఆర్ కల్పించారని ఆయన తెలిపారు. కేంద్రం మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారని అన్నారు.
ప్రజలు కష్టాల్లో ఉంటే ఎందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి ఒకవైపు అంటున్నారని, మరోవైపు ప్రజలకు కష్టాలు లేవు, మాది ప్రజా పాలన అని చెబుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి జపాన్ వెళ్లి వచ్చి మైండ్ పాడైనట్లుందని, లేకుంటే రజతోత్సవ సభకు వచ్చిన జనాన్ని చూసి మైండ్ బ్లాంక్ అయినట్లుందని అన్నారు.
కేసీఆర్ కిట్టు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ, పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలు ఆగిపోయాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, ఏడాదిలో రెండున్నర లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, విద్యాభరోసా కార్డు, స్కూటీ, మహిళలకు 2500, తులం బంగారం, కౌలు రైతులకు భరోసా, 15వేల రైతు భరోసా ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాళేశ్వరం, రుణమాఫీ, రైతు బంధు, 60వేల ఉద్యోగాలు, కులగణన వంటి అంశాలపై చర్చకు సిద్ధమని హరీష్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవాలని, కాంగ్రెస్ సర్కారు అట్టర్ ఫ్లాప్ అని రోజుకోసారి నిరూపితమవుతోందని అన్నారు.
శిశుపాలుడి లెక్క తప్పు మీద తప్పు చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరును పలకాల్సిన అవసరం లేదని అన్నారు.