బలగం టీవీ, ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో రౌడీషీట్లు నమోదైన వారితో గురువారం ఉదయం స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ మేళా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ, రౌడీయిజానికి పాల్పడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తూ అన్ని విధాలుగా అష్టదిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు.
సత్ప్రవర్తన కలిగిన వారికి రౌడీషీట్లు తొలగించి సరైన న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, రౌడీయిజం చేయడం లాంటివి మానుకోవాలని సూచించారు. రౌడీలపై ఉన్న కేసుల వివరాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, నమోదైన కేసుల్లో శిక్ష పడేలా కృషి చేస్తామని, బాధితులకు న్యాయం చేస్తామని ఆయన అన్నారు.
ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ప్రశాంత వాతావరణం కల్పించడానికి తన వంతు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. రౌడీషీట్లో ఉన్న వారందరూ మళ్లీ గంజాయి దందా, మట్కా దందా, రౌడీయిజం, హత్యలు, హత్యాయత్నాలు, నేరాలు, ప్రజలను బెదిరించడం, కోట్లాటలు, గొడవలు లాంటివి మొదలుపెడితే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.