బలగం టీవీ, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు. తమ 21 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆర్టీసీ కార్మిక జేఏసీ రెండుగా చీలిపోయింది. వెంకన్న నేతృత్వంలోని ఒక వర్గం సమ్మెకు సిద్ధం కాగా, అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని మరో వర్గం సమ్మె వద్దని వాదిస్తోంది.
సమ్మె చేస్తే ఎస్మా (Essential Services Maintenance Act) ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా, వెంకన్న వర్గం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయని ఆ వర్గం స్పష్టం చేసింది.
మరోవైపు, అశ్వత్థామ రెడ్డిని ఆర్టీసీ కార్మిక ద్రోహిగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రంగా విమర్శించారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన విఫలమయ్యారని వారు ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో రేపటి నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయే అవకాశం ఉంది.