బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని తిప్పాపూర్ గ్రామ శివారులో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. పొరుగున ఉన్న సిద్దిపేట జిల్లా నుండి అటవీ మార్గం ద్వారా ఈ పులి తిప్పాపూర్ గ్రామ పరిధిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది..
గత రెండు రోజులుగా గ్రామ శివారులో సంచరిస్తున్న పెద్దపులి, ఇప్పటికే మూడు ఆవు దూడలపై దాడి చేసి చంపివేసింది. పశువుల కళేబరాలను చూసిన రైతులు భయాందోళనతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగుజాడలను పరిశీలించారు. పులి సంచారం వాస్తవమేనని ధృవీకరించిన అధికారులు, గ్రామ ప్రజలు మరియు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
ముఖ్యంగా రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లకూడదని, రాత్రి సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులిని తిరిగి అడవిలోకి పంపేందుకు అటవీశాఖ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.




