– మృతదేహాల వెలికితీతలో కాంగ్రెస్ వైఫల్యం – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
బలగం టీవీ, హైదరాబాద్:
శ్రీశైలం సొరంగంలో సహాయక చర్యలను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆరుగురు కార్మికుల మృతదేహాలను బయటకు తీయకుండానే మూడు నెలలు సహాయక చర్యలు నిలిపివేయడం దారుణమని ఆయన మండిపడ్డారు.
అవగాహన, సమీక్ష లేకుండా హడావుడిగా పనులు మొదలుపెట్టి ఎనిమిది మంది ప్రాణాలు బలిగొన్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కేవలం ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి 63 రోజుల తర్వాత మిగిలిన వారిని వదిలేసి చేతులెత్తేశారని ఆయన విమర్శించారు. హెలికాప్టర్లో తిరిగి, చేపల కూరలు తిని హంగామా చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి ఈ ప్రమాదం విషయంలో అధికారికంగా ఎందుకు ప్రకటన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మరణించిన కుటుంబాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు.
మరణించిన వారి కుటుంబాలకు వారి మృతదేహాలను అప్పగించకుండా కనీసం చివరి చూపుకు కూడా నోచుకోని దయనీయ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని నిరంజన్ రెడ్డి విమర్శించారు. శ్రీశైలం సొరంగం ప్రమాదం, సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
