బలగం టీవీ, హైదరాబాద్:
జనాభా లెక్కల్లో కులగణనను చేర్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం తమ అనుభవాలను కేంద్రానికి అందించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
కులగణన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రివర్గానికి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాష్ట్రాల వారీగా ఓబీసీ కేటగిరీలు వేర్వేరుగా ఉన్నందున, కులగణనలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో చర్చించడానికి మంత్రుల కమిటీని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పారదర్శకంగా కులగణన జరిగిందని, ఈ విషయంలో రాహుల్ గాంధీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు. జనాభా లెక్కలు ఎప్పుడు ప్రారంభమై, ఎప్పటికి పూర్తవుతాయో కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కులగణనలో ఎదురయ్యే సవాళ్లపై రాజకీయ పార్టీల సలహాలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు, సివిల్ సొసైటీల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కులగణన పూర్తి చేయడానికి ఏడాది సమయం సరిపోతుందని అన్నారు. కులగణన చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయంలో కేంద్రానికి సహకరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.