క్యాట్ ఉత్తర్వులపై స్టే విధించిన ధర్మాసనం
బలగం టీవీ, హైదరాబాద్:
ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలంటూ గతంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆమ్రపాలికి కేడర్ కేటాయింపు విషయంలో తాత్కాలికంగా అడ్డంకి ఎదురైంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) అప్పీల్పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసుపై కౌంటర్ (ప్రతివాదన) దాఖలు చేయాలని ఐఏఎస్ ఆమ్రపాలికి సూచించింది. అనంతరం, ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు క్యాట్ ఉత్తర్వులు అమలులో ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది.
