బోయినిపల్లి ఏఎంసీలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన
బలగం టీవీ, బోయినిపల్లి:
గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. బోయినపల్లి లోని ఆర్ఓ కేంద్రంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను తనిఖీ చేశారు. నామినేషన్ తోపాటు అభ్యర్థి నూతన బ్యాంక్ ఖాతా కచ్చితంగా ఉండాలని, అన్ని వివరాలు నింపాలని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన తరువాత వారితో ఎన్నికల నియమావళి, వ్యయం వివరాల అందజేతపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
అనంతరం హెల్ప్ డెస్క్ పరిశీలించి, అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. బోయినిపల్లి జడ్పీ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని తనిఖీ చేసి, చేయాల్సిన ఏర్పాట్లపై ఎంపీడీఓ కు సూచనలు చేశారు.
లారీలు అందుబాటులో ఉండాలి..
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన మేర లారీలు అందుబాటులో ఉండాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం తేమ శాతం, తూకం తనిఖీ చేశారు.
అనంతరం ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన టార్పాలిన్, వసతులు కల్పించాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే సమీప రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీ వేగంగా పూర్తి చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాభాయ్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్. జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీఓ జయశీల తదితరులు పాల్గొన్నారు.

