బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల :
జిల్లాలో సాగునీరు ఇబ్బందులు దూరం చేసేందుకే పనులు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల పక్షపాతి అని,రైతన్నల సంక్షేమమే లక్ష్యముగా సి ఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ముందుకు పోతుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం కోనరావుపేట మండలం మల్కపేటలోని మల్కపేట రిజర్వాయర్ కుడి కాలువ ద్వార నీటిని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఇరిగేషన్ అధికారులతో కలిసి నీటిని విడుదల చేశారు.

అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విప్ అది శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుడి కాలువ కు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. మల్కపేట రిజర్వాయర్ కుడికాలు ద్వారా వేములవాడ నియోజకవర్గంలోని 12 గ్రామాలకు సాగునీరు అందనుందని,ప్యాకేజీ లైన్ లో భాగంగా మల్కపేట రిజర్వాయర్ కుడికాలువ ద్వారా కోనరావుపేట మండలం మల్కపేట, కనగర్తి, నాగారం, పల్లిమక్త, సుద్దాల, రామన్నపేట, మంగళపల్లి గ్రామాలకు, అలాగే వేములవాడ మండలం మారుపాక వరకు నీటిని విడుదల చేశామని అన్నారు. మల్కపేట కుడి కాలువకు 250 క్యూసెక్కులు విడుదల చేశామని, దాదాపు 8 వేల ఎకరాలకు సాగునీరు, అలాగే ఆయా గ్రామాలకు తాగునీరు అందుతుందని అన్నారు.
పదేళ్లుగా పడావు పడ్డ కాలువ పనులను పూర్తి చేసి అందులో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడం జరిగిందని అన్నారు. రైతులకు సాగునీరు అందించిన లక్ష్యంతో మంత్రులతో మాట్లాడి ఎల్లారెడ్డిపేట వరకు రైతాంగానికి నీటిని విడుదల చేయడం జరిగిందని, nమెయిన్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేసి అక్కపల్లి, బుగ్గ రాజేశ్వర తండా, అల్మాస్పూర్ రాజన్నపేట దేవుని గుడి తండా, గొల్లపల్లి బాకృం పల్లి తిమ్మాపూర్ వరకు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు.
భూ నిర్వాసితులకు నష్ట పరిహారం అందజేసి కాలువ పనులు ప్రారంభం చెసి నీటిని విడుదల చేశామని,ఎడమ కాలువ కోసం ఇప్పటి వరకు 70 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందని మరో 70 ఎకరాలు భూసేకరణ చేయడం జరుగుతుందనిఅన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ధనిక పేద తేడా లేకుండా మేనిఫెస్టో లో చెప్పకున్నా సన్నం బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని,.అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే మల్కపేట రామాలయం వరకు 90 లక్షలతో సీసీ రోడు నిర్మాణం చేపట్టడం జరిగిందని, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసామని అన్నారు.
ధాన్యం కొనుగోలు పై ఆందోళన చేసిన వారు తెలుసుకోవాలి…
ఇటీవల కొందరు వరి ధాన్యం కొనుగోలు పై ఆందోళనలు చేశారని, వారు ఒక విషయం తెలుసుకోవాలని, సిరిసిల్ల జిల్లాలో యాసంగి మే 01 నాటికి 2021-22 లో 233 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, 2022-23 లో 9 వేల 424 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారనిఅన్నారు. ఒక రైతుతో మాట్లాడితే గతంలో ఏ విధంగా మోసం చేశారో చెప్పారని, తాలు తప్ప పేరుతో రైతులను మోసం చేసి సంచికి 44 కిలోలు జోకీ రైతులను నిలువునా ముంచారని అన్నారు. రైస్ మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకున్నా రైతులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండాలని ఇంటర్మీడియట్ గోదాములు పెట్టి వడ్లను దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు.
మహిళ తల్లులను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుందని,రాజన్న సిరిసిల్ల జిల్లా లో 600 కొట్లు బ్యాంకు లింకేజి చేయడం జరిగిందన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో 4 మెగావాట్ల సోలార్ పవర్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. మహిళలు ముందుకు వస్తే రైస్ మిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి చట్టంతో రైతులు చాలా ఇబ్బంది పడ్డారని వాటిని పరిష్కరించేందుకే భూ భారతి చట్టం అమలు చేయనున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కచ్చకాయల ఎల్లయ్య, రొండి రాజు, చెలుకల తిరుపతి వైస్ చైర్మన్ ప్రభాకర్, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరేందర్ రెడ్డి ఈ ఈ కిషోర్, డీఈలు సత్యనారాయణ, వినోద్, శ్రీనివాస్ నీటిపారుదల శాఖ అధికారులు, డి ఆర్ డి ఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.