బలగం టీవీ, రాజన్న సిరిసిల్ల:
విధి నిర్వహణలో అప్రమత్తతతో వ్యవహరించి, ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ప్రత్యేకంగా అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణదాతలుగా నిలిచిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లకు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రశంసా పత్రాలు మరియు నగదు బహుమతులను అందజేసి సత్కరించారు.
ఇటీవల జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఈ కానిస్టేబుళ్లు తమ ధైర్యసాహసాలను ప్రదర్శించారు:
వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్ళగా, అక్కడ ఉన్న కానిస్టేబుల్ గంగరాజు వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతనికి సీపీఆర్ నిర్వహించి, గుండె కొట్టుకునేలా చేసి ప్రాణాపాయం నుండి రక్షించారు.
తంగళ్ళపల్లి వద్ద మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని గమనించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నీటిలోకి దూకారు. అతడిని సురక్షితంగా బయటకు తీసి ప్రాణాపాయం తప్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. “పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయం ప్రజల ప్రాణాలను, ఆస్తులను రక్షించడమే. ఆపదలో ఉన్నప్పుడు సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడిన ఈ కానిస్టేబుళ్లు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని కొనియాడారు. ఇదే సేవాభావంతో సిబ్బంది అందరూ విధులు నిర్వహించాలని ఆయన సూచించారు.
